భగవద్గీత - దైవాసురసంపద్విభాగ యోగము - పదహారవ అధ్యాయము
దైవాసురసంపద్విభాగ యోగమునందలి ప్రధాన విషయములు
ఈ అధ్యాయమునందు దైవీసంపద – ఆసురీ సంపద అను రెండు విభాగములను భగవానుడు వర్ణించుచున్నాడు. సంపదయనగా ఐశ్వర్యము. దైవసంపద అనగా దైవికములగు సద్గుణముల యొక్క సంపత్తి, దైవసంబంధమైన గుణరాశి, జీవుని భగవంతుని సమీపమునకు చేర్చునట్టి శీలసంపద. అసురసంపద అనగా రాక్షసగుణములు, దుర్గుణరాశి. భగవంతుని దూరముగ జేసివైచునట్టి దుశ్శీలము. ఈ అధ్యాయమునండు శ్రీకృష్ణపరమాత్మ దైవగుణములను, అసురగుణములను రెండింటిని గూర్చి విపులముగ తెలియజేసిరి. ఏలయనిన ఆ రెండింటిని తెలిసికొనియుండినచో సాధకుడు తన హృదయమును బాగుగ పరిశోధించుకొని, దైవగుణములులేనిచో సంపాదించుటకును, ఉన్నచో ఇంకను అభివృద్ధిపరచుటకును, అసురగుణములుండినచో పారద్రోలుటకును అవకాశము ఉండును. కావున రెండిటిని తెలిసికొనియుండవలెను. ఈ ప్రకారముగ ఆధ్యాత్మక్షేత్రమున సర్వులకును ఉపయోగముగ నుండుటకై భగవానుడు ఆ సద్గుణ, దుర్గుణముల రెండిటిని, దైవ, అసుర సంపదల రెండిటిని చక్కగ విభజించి తెలిపిన అధ్యాయమగుటచే దీనికి దైవాసురసంపద్విభాగయోగము అను పేరు వచ్చినది.
- దైవసంపద (దైవిక గుణసముదాయము) (1వ శ్లో॥ నుండి 3వ శ్లో॥ వరకు)
- అసురసంపద (అసురగుణసముదాయము) (4వ శ్లోకము)
- ఆ రెండింటియొక్క ఫలములు (5వ శ్లోకము)
- అసురసంపదగలవారియొక్క లక్షణములు, వారికి గలుగు అధోగతి (6వ శ్లో॥ నుండి 20వ శ్లో॥ వరకు)
- నరకద్వారములు (21వ శ్లోకము)
- శాస్త్రవిరుద్ధమగు ఆచరణను త్యజించి, శాస్త్రానుకూలమగు ఆచరణను గ్రహించుటను గూర్చిన ఉద్బోధము (22వ శ్లో॥ నుండి 24వ శ్లో॥ వరకు)