భగవద్గీత - విజ్ఞాన యోగము - ఏడవ అధ్యాయము
విజ్ఞాన యోగమునందలి ప్రధాన విషయములు
పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార తత్త్వప్రభావ మహత్త్వాది రహస్యముల సంపూర్ణ జ్ఞానమునే జ్ఞానము అని అందురు. సగుణ నిరాకార, సాకార, తత్త్వముల లీలారహస్యమహత్త్వగుణ ప్రభావాదులను సమగ్రముగా తెలిసికొనుటయే ‘విజ్ఞానము’ అనబడును. విజ్ఞానమనగా విశేషజ్ఞానము. లేక అనుభవపూర్వకమైన జ్ఞానము. లేక ఆత్మ స్వరూపము. జ్ఞానమాత్రముతో సంతృప్తినొందక, విజ్ఞానమును గూడ సముపార్జించవలెనని భగవానుని యాజ్ఞ. అమానిత్వాది జ్ఞానగుణములనేకాక, ఆత్మతత్త్వ రూపమగు విజ్ఞానము యొక్క పరిచయమున్ను ముముక్షువు కలిగియుండవలెను. ఈ జ్ఞానవిజ్ఞాన సహితముగ భగవత్స్వరూపమును తెలిసికొనుటయే సమగ్రముగా భగవంతుని తెలిసికొనుట యగును. ఈ అధ్యాయమునందు భగవత్స్వరూపమును గూర్చియు, దానిని పూర్తిగా తెలిసికొనుటకు యోగ్యులైన వారిని గూర్చియు, సాధనలను గూర్చియు వర్ణనలు గలవు. కనుక ఈ అధ్యాయమునకు ‘విజ్ఞానయోగము’ అను పేరు వచ్చినది.
- విజ్ఞానసహితమగు జ్ఞానముయొక్క ప్రస్తావన (1వ శ్లో॥ నుండి 3వ శ్లో॥ వరకు)
- పరాపరప్రకృతులయొక్క వర్ణనము (4వ శ్లో॥ నుండి 7వ శ్లో॥ వరకు)
- సమస్తపదార్థములందును పరమాత్మయొక్క అస్తిత్వమును ప్రతిపాదించుట (8వ శ్లో॥ నుండి 12వ శ్లో॥ వరకు)
- ఆసురీభావయుక్తులయొక్క గర్హణము, దైవీస్వభావయుక్తులయొక్క ప్చతుర్విధ భక్తుల వివరము (13వ శ్లో॥ నుండి 19వ శ్లో॥ వరకు)
- ఇతర దేవతలనుగూర్చిన ఉపాసనావిషయము (20వ శ్లో॥ నుండి 23వ శ్లో॥ వరకు)
- భగవానుని ప్రభావమును ఎరుంగనివారి స్వభావము, ఎరుంగువారి మహిమ (24వ శ్లో॥ నుండి 30వ శ్లో॥ వరకు)