భగవద్గీత - సాంఖ్య యోగము - రెండవ అధ్యాయము
సాంఖ్య యోగమునందలి ప్రధాన విషయములు
సంఖ్యతో గూడినది సాంఖ్యము. సాంఖ్యమనగా జ్ఞానము. జ్ఞానవిచారణయందు అనాత్మవస్తువులను లెక్కించునపుడు సంఖ్యను ఆశ్రయించవలసి వచ్చును గనుక అయ్యది సాంఖ్యమని చెప్పబడెను. ప్రకృతి యందు గల 24 తత్వములను లేక 96 తత్వములను లెస్సగా శోధించి, అవి అనాత్మరూపములని త్యజించి వానికి సాక్షిగనునట్టి పరమాత్మను గ్రహించుటయే సాంఖ్యవిధ్య. ఆత్మానాత్మవివేక రూపమగు విజ్ఞానమే సాంఖ్యము. ఈ అధ్యాయము నందు శరణాగతుడైన అర్జునుడు తన శోకనివృత్తికై నిశ్చితమైన ఒకే ఒక ఉపాయమును తెల్పుమని భగవానుని ప్రార్థించెను. దానికి భగవానుడు 30వ శ్లోకం వరకు ఆత్మతత్వమును వర్ణించెను – సాంఖ్యయోగ సాధనయందు ఆత్మతత్త్వ శ్రవణ, మనన, నిధిధ్యాసనములే ముఖ్యములైనవి. ఈ అధ్యాయము నందలి 30వ శ్లోకము తరువాత స్వధర్మమును గూర్చి వర్ణించి, కర్మయోగ స్వరూపమును వివరించినప్పటికిని, ఉపదేశము యొక్క ఆరంభము సాంఖ్యయోగము తోడనే జరిగినది. ఆత్మతత్త్వ వర్ణనము ఇతరాధ్యాయముల కంటెను ఈ అధ్యాయము నందే విస్తృతముగా సమగ్రముగా చర్చింపబడినది. ఈ కారమున ఈ అధ్యాయమునకు ‘సాంఖ్యయోగము’ అనునామము ఏర్పడినది.
- అర్జునుడు తన మానసిక వ్యథను శ్రీకృష్ణపరమాత్మ కెరింగించి, నివారణోపాయము నర్ధించుట (1వ శ్లో॥ నుండి 10వ శ్లో॥ వరకు)
- ఆత్మస్వరూప వర్ణనము (11వ శ్లో॥ నుండి 30వ శ్లో॥ వరకు)
- క్షాత్రధర్మము ననుసరించి యుద్ధముచేయవలసిన ఆవశ్యకతను నిరూపించుట (31వ శ్లో॥ నుండి 38వ శ్లో॥ వరకు)
- నిష్కామకర్మయోగ ప్రతిపాదన (39వ శ్లో॥ నుండి 53వ శ్లో॥ వరకు)
- స్థితప్రజ్ఞుని లక్షణములు, అతని మహిమ (54వ శ్లో॥ నుండి 72వ శ్లో॥ వరకు)