భగవద్గీత - శ్రద్ధాత్రయవిభాగ యోగము - పదిహేడవ అధ్యాయము
శ్రద్ధాత్రయవిభాగ యోగమునందలి ప్రధాన విషయములు
శ్రద్ధ మూడు విధములుగా ఉండును. సాత్త్వికశ్రద్ధ, రాజసికశ్రద్ధ, తామసికశ్రద్ధ అని. ఏయే శ్రద్ధ గలవాని లక్షణములు ఏయే విధముగ ఉండునో ఈ అధ్యాయమున వివరముగ తెలుపబడినవి. ఈ అధ్యాయ ప్రారంభమున శ్రద్ధాయుక్తులైన పురుషుల నిష్ఠలను గూర్చి అర్జునుడు ప్రశ్నించెను – దానికి సమాధానముగా భగవానుడు మూడు విధములైన శ్రద్ధలను తెల్పి, వాటిని అనుసరించియే పురుషుల స్వభావములుండునని తెల్పెను. పిమ్మట పూజలు, యజ్ఞములు, తపస్సులు మొదలగు వాటితో శ్రద్ధకు గల సంబంధమును వర్ణించి, చివరి శ్లోకమున శ్రద్ధారహిత పురుషుల కర్మలను ‘అసత్’ అని పేర్కొనెను. ఈ ప్రకారముగ మూడు విధములైన శ్రద్ధను (గుణమును) గురించి చెప్పబడిన అధ్యాయము అగుటచే దీనికి శ్రద్ధాత్రయవిభాగయోగము అను పేరు వచ్చినది.
- మూడువిధములైన శ్రద్ధను గురించిన విషయము (1వ శ్లో॥ నుండి 3వ శ్లో॥ వరకు)
- మూడువిధములైన ఆరాధన – శాస్త్రవిరుద్ధమగు ఘోరతపస్సు (4వ శ్లో॥ నుండి 6వ శ్లో॥ వరకు)
- మూడువిధములైన ఆహారము (7వ శ్లో॥ నుండి 10వ శ్లో॥ వరకు)
- మూడువిధములైన యజ్ఞము (11వ శ్లో॥ నుండి 13వ శ్లో॥ వరకు)
- మూడువిధములైన తపస్సు (14వ శ్లో॥ నుండి 19వ శ్లో॥ వరకు)
- మూడువిధములైన దానము (20వ శ్లో॥ నుండి 22వ శ్లో॥ వరకు)
- ఓం తత్ సత్ – అను మంత్రము యొక్క వ్యాఖ్య (23వ శ్లో॥ నుండి 27వ శ్లో॥ వరకు)
- అశ్రద్ధతో చేయు కార్యము యొక్క ఫలితము (28వ శ్లోకము)