భగవద్గీత - గుణత్రయవిభాగ యోగము - పదనాలుగవ అధ్యాయము
గుణత్రయవిభాగ యోగమునందలి ప్రధాన విషయములు
ఈ అధ్యాయమునందు సత్త్వరజస్తమములు అను మూడు గుణముల స్వరూపములును, వాటి కార్యములును, కారణములును, ప్రభావములును వర్ణింపబడినవి. అవి ఏవిధముగా ఏ పరిస్థితులయందు జీవాత్మను ఎట్టి బంధములలో పడవేయును? మనుష్యుడు ఏ విధముగా వీటి నుండి ముక్తిని పొంది, పరమపదమును చేరగలడు. అట్లే ఈ మూడు గుణముల కతీతుడై పరమాత్మప్రాప్తిచెందిన మనుష్యుని లక్షణములేవి? త్రిగుణ సంబంధమైన ఈ విషయములన్నియును ఇందు వివేచన చేయబడినవి. మొదట సాధనకాలమందు రజస్తమో గుణములను పారద్రోలి, సత్త్వగుణమునే గ్రహింపవలెననియు, చివరికి గుణములన్నింటితో గల సంబంధము పూర్తిగా తొలగించు కొనవలెననియు తెల్పుటకై ఆ మూడు గుణములను విభాగపూర్వముగా వర్ణించుట జరిగినది. కావున ఈ అధ్యాయమునకు ‘గుణత్రయవిభాగయోగము’ అను పేరు ఏర్పడినది.
- జ్ఞానమహిమ, ప్రకృతిపురుషుల వలన జగదుత్పత్తి (1వ శ్లో॥ నుండి 4వ శ్లో॥ వరకు)
- సత్త్వరజస్తమోగుణములయొక్క స్వరూప స్వభావములు (5వ శ్లో॥ నుండి 13వ శ్లో॥ వరకు)
- ఆయా గుణముల యొక్క ఫలితములు (14వ శ్లో॥ నుండి 18వ శ్లో॥ వరకు)
- భగవత్ప్రాప్తికి ఉపాయము (19వ శ్లో॥ నుండి 20వ శ్లో॥ వరకు)
- గుణాతీతుని లక్షణములు (21వ శ్లో॥ నుండి 27వ శ్లో॥ వరకు)