భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము - పదకొండవ అధ్యాయము
విశ్వరూపసందర్శన యోగమునందలి ప్రధాన విషయములు
అర్జునుని ప్రార్థనను అనుసరించి భగవానుడు తన విశ్వరూపమును ఆతనికి జూపించిరి. ఈ అధ్యాయమునందలి ఎక్కువ భాగము ఆ విశ్వరూపము యొక్క వర్ణనలతోను, అట్టి విశ్వరూపియగు భగవానునకు అర్జునుడు గావించిన స్తోత్రములతోను గూడియుండుటబట్టియు సాక్షాత్ భగవానుని యొక్క విశ్వరూపసందర్శనము అర్జునునకు లభించిన అధ్యాయమగుటచేతను దీనికి ‘విశ్వరూపసందర్శనయోగము’ అను పేరు కలిగినది.
- విశ్వరూపమును జూపవలసినదిగా అర్జునుడు భగవానుని ప్రార్థించుట (1వ శ్లో॥ నుండి 4వ శ్లో॥ వరకు)
- భగవానుడు తన విశ్వరూపమును వర్ణించుట (5వ శ్లో॥ నుండి 8వ శ్లో॥ వరకు)
- సంజయుడు ధృతరాష్ట్రునకు విశ్వరూపమును వర్ణించి చెప్పుట (9వ శ్లో॥ నుండి 14వ శ్లో॥ వరకు)
- అర్జునుడు భగవానుని విశ్వరూపమును దర్శించుట, స్తుతించుట (15వ శ్లో॥ నుండి 31వ శ్లో॥ వరకు)
- భగవానుడు తనశక్తిని వెల్లడించుచు యుద్ధమొనర్చుటకై అర్జునుని ఉత్సహింపజేయుట (32వ శ్లో॥ నుండి 34వ శ్లో॥ వరకు)
- విశ్వరూపమును జూచి భీతిల్లిన అర్జునుడు భగవానుని స్తుతించుట, చతుర్భుజరూపము తిరిగి గ్రహించులాగున ప్రార్థించుట (35వ శ్లో॥ నుండి 46వ శ్లో॥ వరకు)
- భగవానుడు విశ్వరూపసందర్శన మహిమను చెప్పుట, తిరిగి సౌమ్యరూపమును గ్రహించుట (47వ శ్లో॥ నుండి 50వ శ్లో॥ వరకు)
- అనన్యభక్తిచేతనే విశ్వరూపసందర్శనము సాధ్యపడగలదని చెప్పుట, ఫలసహితముగ అనన్యభక్తిని గూర్చి ప్రవచించుట (51వ శ్లో॥ నుండి 55వ శ్లో॥ వరకు)