భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము
భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - పదకొండవ శ్లోకము
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః ।
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ॥
చ = కావున
సర్వేషు అయనేషు చ = అన్ని వ్యూహ ద్వారములయందును
యథాభాగమ్ = మీమీ స్థానములయందు
అవస్థితాః = నిలిచియున్నవారై
భవంతః = మీరు,
సర్వే, ఏవ = అందరును
హి = నిస్సందేహముగా
భీష్మమ్ ఏవ = భీష్మపితామహునే
అభిరక్షంతు = (అన్నివైపుల నుండి) రక్షింతురుగాక
తాత్పర్యం :-
కనుక మీరందరును మీమీ స్థానములలో సుస్థిరముగా నిలిచి, అన్నివైపులనుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండుడు.
భీష్మపితామహుడు తనను తాను రక్షించుకొనుటలో సర్వథా సమర్థుడే అను విషయము దుర్యోధనుడు బాగుగా నెరుగును. ద్రుపద పుత్రుడగు శిఖండి తొలుత స్త్రీగా జన్మించి, తదుపరి పురుషుడుగా మారెను, “స్త్రీ రూపముతో జన్మించినందున నేను వానిని ఇప్పటికిని స్త్రీగనే భావింతును. వీరపురుషుడగువాడు స్త్రీలపై శస్త్రములను ప్రయోగింపను.” అని భీష్ముడు ముందుగనే వచించి చేరిన మీదట యోధులందరితో బాటు దుశ్శాసనుని హెచ్చరించుచూ దుర్యోధనుడు ముందుగనే ఇదే విషయమును సవిస్తరముగా తెలియజెప్పెను. ఇచట కూడా అట్టి భయమునే ఊహించి దుర్యోధనుడు తన పక్షమున గల ప్రముఖ మహారథులందరిని ఈ విధముగా కోరుచున్నాడు. మీరందరును నియమింపబడిన వ్యూహద్వారములయందు దృఢముగ నిలిచియుండి, పూర్తిగా అప్రమత్తులై ఏ వ్యూహద్వారము నుండియు శిఖండి మన సేనలోనికి ప్రవేశించి భీష్మపితామహుని యొద్దకు చేరకుండునట్లు చూడుడు. ముందుకు వచ్చినచో, తక్షణమే శిఖండిని తరిమి పారద్రోలుటకు మహారథులకు మీరందరు సావధానులై యుండగలరు. ఇట్లు మీరు శిఖండినుండి భీష్ముని రక్షింపగలిగినచో, మనకెట్టి భయములేదు. మిగిలిన మహారథులను జయించుట భీష్మునకు చాల సులభమైన పని.