భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము
భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - పంతొమ్మిదవ శ్లోకము
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ ।
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ॥
చ = మరియు
సః = ఆ (అట్టి)
తుములః = భయంకరమైన
ఘోషః = నాదము
నభః చ = ఆకాశమును
పృథివీమ్ ఏవ = భూమిని గూడ
వ్యనునాదయన్ = ప్రతిధ్వనింప జేయుచు
ధార్తరాష్ట్రాణామ్ = ధార్తరాష్ట్రుల యొక్క అనగా మీ వారి
హృదయాని = హృదయములను
వ్యదారయత్ = కకావికలములుగాజేసెను
తాత్పర్యం :-
పాండవపక్ష మహాయోధుల శంఖనినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలములయ్యెను.
పాండవసేనలోని వీరులెల్లరు ఒక్కుమ్మడిగా శంఖములు మ్రోగింపగనే ఆ ధ్వని ఎంతో గంభీరమై, గూఢమై, ఉచ్చమై, భయానకమై సమస్త భూనభోంతరాళములు వ్యాపించెను. ఈ విధముగా అన్ని దిశలయందు భీషణధ్వనులు నిండగా, సర్వత్ర ప్రతిధ్వని యుత్పన్నమై భూమ్యాకాశములు మార్మ్రోగెను. ఆ శంఖారావముల ప్రతిధ్వనిని నిలిచియున్న అన్యయోధులందరికిని హృదయకుహరములలో మహాభయము జనింపగా, వారు తమ గుండెలను ఎవరో పిండుచున్నట్లుగా వ్యథజెందిరి.
పాండవుల శంఖధ్వనితో కౌరవవీరులు వ్యథితులగుటను వర్ణించిన సంజయుడు ఇక రాబోవు నాలుగు శ్లోకములలో శ్రీకృష్ణభగవానునితో అర్జునుడు పలికిన ఉత్సాహపూరిత వచనములను వర్ణించుచున్నాడు.