భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము
భగవద్గీత - అర్జునవిషాదయోగము - మొదటి అధ్యాయము - నలుబై మూడవ శ్లోకము
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ।
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ॥
ఏతైః = ఇట్టి
వర్ణసంకరకారకైః = వర్ణసాంకర్యములకు హేతువులైన
దోషైః = దోషములచే
కులఘ్నానామ్ = కులఘాతకుల యొక్క
శాశ్వతాః = సనాతనములైన
కులధర్మాః చ = కులధర్మములును
జాతిధర్మాః = జాతిధర్మములును
ఉత్సాద్యంతే = నష్టములగును
తాత్పర్యం :-
వర్ణసాంకర్యములకు మూలములైన ఈ దోషములవలన కులఘాతకులయొక్క సనాతన కులధర్మములు, జాతిధర్మములు నష్టమగును.
మానవుడు తన చరమ లక్ష్యమైన ముక్తిని బడయురీతిలో మానవ సంఘపు నాలుగు వర్ణముల వారి కర్మలు నిర్ణయింపబడినవి. అవి సనాతనధర్మము లేదావర్ణాశ్రమధర్మముచే నిర్దేశింపబడినవి. కనుకనే బాధ్యతారహితులైన నాయకులచే సనాతనధర్మ విధానము విచ్ఛిన్నము గావింపబడినప్పుడు సంఘములో అయోమయస్థితి ఏర్పడును. తత్ఫలితముగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును మరచిపోవుదురు. అటువంటి నాయకులు అంధులుగా పిలువబడుదురు. వారిని అనుసరించు జనులు నిక్కముగా అయోమయస్థితిన పడగలరు.